- తాండూరు మున్సిపల్ ఫలితాల జాతకం రేపే…!
- ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
- సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్ వద్ద పకడ్బందీ భద్రత
- 36 వార్డులు.. 3 రౌండ్లు.. ఫలితాల వెల్లడి
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ఊరిస్తూ వస్తున్న ఫలితాల సమయం ఆసన్నమైంది. తాండూరు మున్సిపాలిటీలోని 36 వార్డుల భవితవ్యం రేపు తేలిపోనుంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఇక్కడే కౌంటింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. మొత్తం 36 వార్డులకు గాను, రెండు ప్రత్యేక గదులను కేటాయించారు.మొత్తం 36 వార్డులను మూడు రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్లో 12 వార్డుల ఫలితాలను ప్రకటిస్తారు.ఎన్నికల సూపర్ వైజర్లు, పీఓల సమక్షంలో లెక్కింపు జరుగుతుంది.కౌంటింగ్ హాల్లోకి కేవలం పోటీ చేసిన అభ్యర్థులకు లేదా వారి ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు.






