మన దేశంలో వేలు, లక్షలు ఖర్చుపెట్టి చదువుకుని డిగ్రీలు సంపాదించుకుంటున్న వారికి, ఆ తర్వాత అందుకు తగిన ఉద్యోగాలు మాత్రం లభించడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా అర్హతకు తగిన ఉద్యోగాలు చేస్తున్న వారి శాతం కేవలం 8.25 శాతమే అంటే మీరు నమ్మగలరా ? నీతి ఆయోగ్ (Niti Aayog) తన తాజా రిపోర్ట్ లో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. దేశంలో విద్యార్ధుల చదువులకూ, వారు చేస్తున్న ఉద్యోగాలకూ మధ్య తీవ్ర అసమానత ఉందని నీతి ఆయోగ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. ఇదో ప్రమాదకర సంకేతంగా నీతి ఆయోగ్ తెలిపింది.
గతంతో పోలిస్తే మన దేశం ఇప్పుడు భారీ ఎత్తున గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. అయినా విద్యార్ధులు చదివిన దానికీ, వాస్తవంగా వారు చేస్తున్న ఉద్యోగాలకూ సంబంధం ఉండటం లేదని నీతి ఆయోగ్ తెలిపింది. విద్యార్ధుల డిగ్రీల్ని ఉద్యోగాలుగా మార్చడంలో దేశం ఇబ్బంది పడుతోందని నీతి ఆయోగ్ తాజాగా ప్రచురించిన పత్రంలో పేర్కొంది. ఇక్కడ సమస్య కేవలం నిరుద్యోగం మాత్రమే కాదని, విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ మార్కెట్ మధ్య ఉన్న ఒక లోతైన అసమతుల్యత అని వెల్లడించింది. ‘రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ విక్సిత్ భారత్ @2047’ అనే టైటిల్ తో తయారు చేసిన ఈ పత్రంలో నీతి ఆయోగ్.. కేవలం 8.25% మంది పట్టభద్రులు మాత్రమే వారి అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలలో ఉపాధి పొందుతున్నారని తేల్చేసింది.
నీతి ఆయోగ్ పత్రంలో అంశాల్ని గమనిస్తే.. డిగ్రీలు సంపాదించడానికి సంవత్సరాలు గడిపిన లక్షలాది మంది యువత పరిస్థితి ఏమిటి? వారు చదివిన దానికి సంబంధించిన ఉద్యోగానికి స్పష్టమైన మార్గం లేకుండా బయటపడితే పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఈ విషయాన్నే వెల్లడించారు. పట్టభద్రులు ఉద్యోగం చేయకపోవడం, చదువు లేదా శిక్షణలో లేకపోవడం, మొత్తం ఉపాధిలో ప్రభుత్వ ఉద్యోగాల వాటా తక్కువగా ఉన్నప్పటికీ దేశం వాటిపై ఎక్కువగా ఆధారపడటం గురించి అడిగితే.. అసలు సమస్య కోర్సుల నుండే మొదలవుతుందని ఆమె తేల్చేశారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్పింది. దేశంలో 3 కోట్ల మంది డిగ్రీలు చదువుతుంటే, అందులో 2 కోట్ల మంది బీఎస్సీ, బీఏ, బీకామ్ లో చదువుతున్నారని, దీనికి కారణం ప్రభుత్వ నియామకాలకు ఇవి అర్హత అవుతాయని భావించడమే అని నీతి ఆయోగ్ తేల్చింది.
