- ప్రజా పాలన అంటే హౌస్ అరెస్ట్లు చేయడమేనా?’
- రేవంత్ సర్కార్పై పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్
- మణికొండ లోని నివాసం లో హౌస్ అరెస్ట్
జనవాహిని ప్రతినిధి తాండూరు; సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుని, హౌస్ అరెస్ట్లు చేయడాన్ని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మణికొండలోని తన నివాసం వద్ద పోలీసుల ఆంక్షలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కోకాపేటలో మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు ప్రధాన నాయకులను, మణికొండలో తనను పోలీసులు నిరోధించడంపై రోహిత్ రెడ్డి స్పందించారు.. సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం తనదే అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడికి ప్రతిపక్షాలు వెళ్తుంటే ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. ఆసుపత్రి నిర్వహణలో అంతా పారదర్శకంగా ఉంటే ఈ ముందస్తు అరెస్ట్లు ఎందుకు? అని నిలదీశారు.
సనత్నగర్ టిమ్స్ గేటు ముందు గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని, వారి సమస్యలను తెలుసుకుని అండగా నిలబడటమే తాము చేసిన తప్పా అని రోహిత్ రెడ్డి నిలదీశారు. నెలల తరబడి పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల ద్వారా మా అడుగులను ఆపగలరేమో కానీ, ప్రజా సమస్యలపై వచ్చే ప్రశ్నలను ఆపలేరని రోహిత్ రెడ్డి ఆరోపించారు. టిమ్స్లో జరుగుతున్న లోపాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి అని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, ఇండ్ల ముందు పోలీసులను పెట్టి బెదిరింపులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇప్పటికైనా అక్రమ అరెస్టులు మాని, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.