- తాండూరులో లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తిన విమర్శలు
- ప్రజాప్రతినిధికి సొంత భవనం ఉన్నా దరఖాస్తు చేయడమేంటి?
- మండిపడుతున్న స్థానికులు, పేదలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. అర్హులైన పేదలకు దక్కాల్సిన ఇళ్ల జాబితాలో ఏకంగా అధికార మున్సిపల్ కౌన్సిలర్ భార్య పేరు వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనంగా మారింది.శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. రాండమైజేషన్ (డ్రా) పద్ధతి ద్వారా వార్డుల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుండగా.. పట్టణంలోని 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ భార్య పేరు లబ్ధిదారుల జాబితాలో వచ్చింది. కౌన్సిలర్ భార్యకు ఇల్లు కేటాయించడమేమిటని పౌర సమాజం, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి పేదల హక్కులను కాలరాసేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన పేదలకే ఇళ్లు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




