- కౌన్సిలర్ హోదా, విధులు, నిబంధనలపై అవగాహన పెరిగింది
- ఈఎస్సిఐ శిక్షణలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్పై నిపుణుల మార్గదర్శకత్వం
- ఉత్సాహంగా పాల్గొన్న తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు
జనవాహిని ప్రతినిధి తాండూరు: హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతులలో కౌన్సిలర్ల విధులు, బాధ్యతలు మరియు మున్సిపల్ నిబంధనలపై పూర్తి అవగాహన లభించిందని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. ఒక కౌన్సిలర్గా క్షేత్రస్థాయిలో చేయాల్సిన ప్రాథమిక పనులు, వార్డు అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర, మరియు మున్సిపల్ చట్టాల ప్రకారం పాటించాల్సిన నిబంధనల గురించి ఈఎస్సిఐ నిపుణులు సమగ్రంగా వివరించారని పేర్కొన్నారు.కౌన్సిలర్ హోదాకు ఉండే అధికారాలు, కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేసే విధానం, అధికారులతో సమన్వయం సాధిస్తూ వార్డు సమస్యలను పరిష్కరించే పద్ధతులపై స్పష్టమైన మార్గదర్శకత్వం లభించిందని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. శిక్షణలో నేర్చుకున్న నియమ నిబంధనలకు లోబడి, తాండూరు పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మరియు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు నిరంతరం శ్రమిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, బీజేపీ పార్టీ కౌన్సిలర్ లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
