విదేశాలకు తరలిపోతున్న IIT గ్రాడ్యుయేట్లు..! పార్లమెంట్ లో కేంద్రం షాకింగ్ రీజన్..!
మన దేశంలో అత్యున్నత స్దాయి విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీల్లో (IIT) విద్యనభ్యసించి గ్రాడ్యుయేట్లు అవుతున్న వారు తమ మొదటి ఛాయిస్ గా విదేశాల్ని ఎంచుకోవడం ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య ఈ ట్రెండ్ మరింత పెరుగుతోంది. ఇలా దేశంలో నిపుణులంతా విదేశాలకు తరలిపోవడాన్ని మేథో వలసగా పేర్కొంటారు. దీనిపై ఇవాళ పార్లమెంట్ లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో ఐఐటి క్యాంపస్ ప్లేస్మెంట్లు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్లిన గ్రాడ్యుయేట్ల సంఖ్య, వారి వలసల వెనుక గల కారణాలను టీఎంసీ ఎంపీ మాలా రాయ్ లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో ఐఐటీ గ్రాడ్యుయేట్లు విదేశాలకు తరలివెళ్లిపోవడంపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందించిన కేంద్రం.. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడం లేదా ఉద్యోగం చేయడం అనేది వ్యవస్థాగత లోపాలకు ప్రతిబింబం కాదని, అది కేవలం వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన విషయమని తేల్చిచెప్పేసింది. విద్యావకాశాలు, ఆర్థిక స్థోమత, వృత్తిపరమైన ఆకాంక్షలు వంటి అంశాలు విదేశాలకు వెళ్లే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని, అదే సమయంలో చాలా మంది పట్టభద్రులు అంతర్జాతీయంగా అనుభవం గడించాక స్వదేశానికి తిరిగి వస్తారని విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ వెల్లడించారు.క్యాంపస్ ప్లేస్మెంట్లు పొంది విదేశాలకు వెళ్లిన ఐఐటి గ్రాడ్యుయేట్ల సంఖ్య మాత్రం ఆయన వెల్లడించలేదు.

ప్లేస్మెంట్ ఫలితాలను మెరుగుపరచడానికి, విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచడానికి ఐఐటీలు అనేక కార్యక్రమాలను చేపట్టాయని తెలిపారు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఐఐటీలు తమ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ల సాయంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ, విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్ గణాంకాలు అనేక ఇతర అంశాలచే ప్రభావితమవుతాయని కేంద్రం పేర్కొంది. వీటిలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, విద్యార్థులు ఉన్నత విద్య లేదా పరిశోధనను ఎంచుకోవడం, స్టార్టప్ వెంచర్ల పట్ల పెరుగుతున్న ఆసక్తి వంటివి ఉన్నాయన్నారు. భారీగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్వచ్ఛందంగా క్యాంపస్ ప్లేస్మెంట్లలో పాల్గొనకుండా, దానికి బదులుగా ఆఫ్-క్యాంపస్ నియామక అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదా పోటీ పరీక్షలకు సన్నద్ధమవడం వంటివి చేస్తున్నారని తెలిపారు.


