మా వద్ద ప్లాట్లు కొంటే.. జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం: టీటీడీ రియాక్షన్.. స్ట్రాంగ్
తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో సామాజిక మాధ్యమాలలో సాగుతున్న నకిలీ ప్రచారాలపై తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత కఠినంగా స్పందించింది. తిరుపతి జాతీయ రహదారి వెంబడి ప్లాట్లు కొనుగోలు చేస్తే లైఫ్టైమ్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తోన్న ఓ ప్రైవేట్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. భక్తులను గందరగోళానికి గురిచేస్తూ, వారిని మోసగించేలా ఉన్న ఇలాంటి తప్పుడు వాణిజ్య ప్రకటనలను ఖండిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్సీపీ డెవలపర్స్ ఈ రకమైన ప్రచారానికి తెర తీసింది. సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద ఆఫర్ను ప్రచారంలోకి తెచ్చింది. తిరుపతి హైవే పక్కన తాము విక్రయిస్తున్న లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని జీవితకాలం పాటు కల్పిస్తామని పలు రీల్స్ ను పోస్ట్ చేసింది. భక్తులకు టీటీడీ కల్పిస్తోన్న వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ఇలా తన వ్యాపార ప్రకటనల కోసం వినియోగించుకుంది.

ఈ ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన అన్ని రకాల టికెట్లు, ఆర్జిత సేవలు నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే అత్యంత పారదర్శకంగా సాగుతాయని స్పష్టం చేసింది. సామాన్య భక్తులను ప్రలోభపెట్టడానికి ఏ ప్రైవేట్ సంస్థకు గానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు గానీ ఇలాంటి భరోసాలు ఇచ్చే అధికారం అస్సలు లేదని తేల్చి చెప్పింది.
వాణిజ్య ప్రయోజనాల కోసం దేవుడి పేరును, దర్శనం సౌకర్యాన్ని వాడుకోవడం పూర్తిగా బాధ్యతారహితమైన చర్య అని టీటీడీ హెచ్చరించింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం అధికారులు ఎస్సీపీ డెవలపర్స్ పై చర్యలకు దిగారు. విజిలెన్స్ నిఘా తీవ్రం కావడంతో ఎస్సీపీ డెవలపర్స్ సంస్థ సామాజిక మాధ్యమాల్లో ఉన్న తమ ప్రచార వీడియోలను, ప్రకటనలను హుటాహుటిన తొలగించింది.
దేవుని పేరుతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయమని టీటీడీ స్పష్టం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో రియల్ ఎస్టేట్ సంస్థలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చేసే ఇటువంటి మోసపూరిత ఆఫర్లను భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన సమాచారం, ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదం, వసతి గదుల బుకింగ్లకు సంబంధించి ఏ సమాచారమైనా సరే భక్తులు తమ అధికారిక వెబ్సైట్ ద్వారానే తెలుసుకోవాలని సూచించింది.


