తెలంగాణాలో కొత్త మామునూరు, అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లపై తీపికబురు!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ లో నిర్మాణానికి కావాల్సిన సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి పైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు.
త్వరలోనే మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ
2028 జూన్ రెండో తేదీ నాటికి మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇప్పటికే మామునూరు ప్రాజెక్టు విస్తరణకు 253 ఎకరాల భూమిని సేకరించి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్టు స్పష్టం చేశారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని తెలిపారు.

రాష్ట్రాభివృద్ధికి విమానాశ్రయాల అవసరం ఉందన్న సీఎం రేవంత్
ఇదిలా ఉంటే దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ, జీడీపీలో మాత్రం 5 శాతం వాటా కలిగి ఉందని… రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల డిజైన్ల ఖరారు, వసతుల కల్పనపై చర్చించారు.
రెండు విమానాశ్రయాల పనులు పూర్తి చేయటానికి డేట్ ఫిక్స్
ఈ రెండు విమానాశ్రయాల పనులను 2028, జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి.. రీజినల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే సౌత్ పార్ట్కు కూడా త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతుందని పేర్కొన్న ముఖ్యమంత్రి, త్వరలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ సమావేశం కానున్నారు.
