- ఆర్. కృష్ణయ్య దీక్షకు తాండూర్ బీసీల మద్దతు
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
- హైదరాబాద్ తరలివెళ్లిన నియోజకవర్గ బీసీ నేతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తాండూర్ నియోజకవర్గం నుండి భారీ మద్దతు లభించింది. నియోజకవర్గానికి చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, వివిధ బీసీ సంఘాల నాయకులు మంగళవారం భారీ సంఖ్యలో హైదరాబాద్కు చేరుకుని దీక్షా శిబిరం వద్ద ఆయనకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ.. బలహీన వర్గాల విద్యా, సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచాలని, అద్దె కొంపల్లో నడుస్తున్న బీసీ గురుకుల పాఠశాలలకు త్వరితగతిన సొంత భవనాలు నిర్మించి విద్యార్థులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.బీసీల హక్కుల సాధన కోసం ఆర్. కృష్ణయ్య నిరంతరం చేస్తున్న పోరాటాలకు తాండూర్ బీసీ సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమాజంలో మెజారిటీగా ఉన్న బీసీలు ఐక్యంగా పోరాడినప్పుడే హక్కుల సాధన సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, నాయకులు మంజుల, నర్సమ్మ, పరమేష్, సోషల్ మీడియా ఇన్చార్జ్ బాషు, వివేక్, కిరణ్, యాసర్, అరుణ్, రాకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.