సండే స్పెషల్ “ఫిష్ బిర్యానీ” ట్రై చేస్తారా..?
తెలుగు రాష్ట్రాలలో సీ ఫుడ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చేపలలో ప్రోటీన్లు, విటమిన్-డి.. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది మేలైన పోషకాహారంగా నిలుస్తుంది. ముఖ్యంగా వారానికి కనీసం రెండు సార్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గడమే కాకుండా, కంటి చూపు మెరుగవుతుందని వైద్యులు చెబుతుంటారు.
కాగా చేపలతో చేసే వంటకాల్లో ఫిష్ బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. సువాసనలు వెదజల్లే బాస్మతి బియ్యం, మసాలాల్లో బాగా మ్యారినేట్ చేసిన చేప ముక్కలు, ఘుమఘుమలాడే బిర్యానీ మసాలా.. ఇవన్నీ కలిస్తే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం. చికెన్, మటన్ బిర్యానీలకు భిన్నంగా ఫిష్ బిర్యానీ చాలా తేలికగా జీర్ణమవుతుంది. వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు..
- చేప ముక్కలు – 500 గ్రాములు (ముళ్లు తక్కువగా ఉండే చేప)
- కారం – 2 టీస్పూన్లు
- పసుపు – ½ టీస్పూన్
- ఉప్పు – తగినంత
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1½ టేబుల్ స్పూన్లు
- నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
- మిరియాల పొడి – ½ టీస్పూన్
- గరం మసాలా – ½ టీస్పూన్
- బాస్మతి బియ్యం – 2 కప్పులు
- ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
- టమాటాలు – 2 (తరిగినవి)
- పెరుగు – ½ కప్పు
- పచ్చిమిర్చి – 4 (చీల్చినవి)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
- బిర్యానీ మసాలా – 2 టీస్పూన్లు
- ధనియాల పొడి – 1 టీస్పూన్
- జీలకర్ర పొడి – ½ టీస్పూన్
- గరం మసాలా – 1 టీస్పూన్
- కొత్తిమీర – ఒక గుప్పెడు
- పుదీనా – ఒక గుప్పెడు
- నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
- నూనె – 4 టేబుల్ స్పూన్లు
- నీరు – తగినంత
- బిర్యానీ ఆకు – 2
- యాలకులు – 4
- లవంగాలు – 5
- దాల్చిన చెక్క – 2 చిన్న ముక్కలు
- షాజీరా – ½ టీస్పూన్
- ఉప్పు – తగినంత
- వేయించిన ఉల్లిపాయలు (బిరిస్తా)
- కొత్తిమీర
- పుదీనా
- కుంకుమపువ్వు కలిపిన పాలు (ఐచ్చికం)
- నెయ్యి
తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను బాగా కడిగి నీరు పూర్తిగా వంపేయాలి. తరువాత వాటిలో కారం, పసుపు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. కనీసం 20-30 నిమిషాల పాటు మ్యారినేట్ అయ్యేలా పక్కన ఉంచాలి.
పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. మ్యారినేట్ చేసిన చేప ముక్కలను రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. పూర్తిగా క్రిస్పీగా కాకుండా జాగ్రత్తగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్లో అవసరమైతే కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. అనంతరం పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి.
చివరగా వేయించిన చేప ముక్కలను జాగ్రత్తగా గ్రేవీలో వేసి 3-4 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీరు మరిగించి అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఉప్పు వేయాలి.
ముందుగా అరగంట నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి 70 శాతం మాత్రమే ఉడికించాలి. అనంతరం నీరు వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.
మందపాటి అడుగు ఉన్న గిన్నెలో ముందుగా చేపల గ్రేవీని వేయండి.. దాని మీద ఉడికించిన బియ్యాన్ని ఒక పొరలా వేయాలి.
ఆపై వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు చల్లాలి.
మూత గట్టిగా పెట్టి లేదా అల్యూమినియం ఫాయిల్తో సీల్ చేసి 15-20 నిమిషాలు చాలా తక్కువ మంటపై దమ్ పెట్టాలి.
సర్వింగ్ సూచనలు..
వేడివేడిగా ఉన్న ఫిష్ బిర్యానీని ఉల్లిపాయ రైతా, మిర్చి కా సలాన్, చికెన్ లేదా ఫిష్ షేర్వా, ఉడికించిన గుడ్లు, నిమ్మ ముక్కలు, ఉల్లిపాయ సలాడ్తో వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది.