- ప్రజల సౌకర్యార్థం రెండు కేంద్రాల ఏర్పాటు
- ఫామ్లను ఉచితంగా నింపిస్తున్న కౌన్సిలర్ జావిద్
- నెల రోజుల పాటు సేవలు.. సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ పరిధిలో ‘ఎస్ ఐ ఆర్’ ప్రక్రియ అత్యంత ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 8వ వార్డు ప్రజల సౌకర్యార్థం రాజీవ్ కాలనీలో, ఇందిరమ్మ కాలనీలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ వార్డులోనే రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్ ఐ ఆర్ ఫామ్లను నింపే క్రమంలో వార్డు ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తికమకపడకుండా, దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ కేంద్రాల ద్వారా సిబ్బంది స్వయంగా ప్రజల వద్ద నుండి వివరాలు సేకరించి, ఉచితంగా ఎస్ ఐ ఆర్ ఫామ్లను నింపి ఇస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ.. వార్డు ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హులైన వారంతా తమకు సంబంధించిన సరైన గుర్తింపు కార్డులు, తగిన పత్రాలను తీసుకొచ్చి ఈ కేంద్రాలలో ఎస్ ఐ ఆర్ ఫామ్లను సులభంగా పూర్తి చేసుకోవచ్చని సూచించారు.ఈ ప్రక్రియ సుమారు నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని, ఈ నెల రోజుల పాటు రెండు కేంద్రాలు ఉదయం నుండి సాయంత్రం వరకు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కాలపరిమితి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎలాంటి తొందరపాటు పడకుండా ప్రశాంతంగా వచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వార్డులోనే కేంద్రాలను ఏర్పాటు చేసి, ఉచితంగా ఫామ్లు నింపించి ఇస్తున్న కౌన్సిలర్ జావిద్ కు వార్డ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.



