- పర్యావరణ హితంగా ఆర్బీఓఎల్ సీఈఓ వివాహ వార్షికోత్సవం
- మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచిన సరళ – శ్రీనివాస్ రెడ్డి దంపతులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బుయ్యని సరళ – శ్రీనివాస్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారు ఒక వినూత్నమైన పర్యావరణ హిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడంబరాలకు పోకుండా, తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటి ప్రకృతి పట్ల తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.ఈ సందర్భంగా సరళ శ్రీనివాస్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో కేవలం వేడుకలు జరుపుకోవడమే కాకుండా, రాబోయే తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని శుభకార్యాల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలని కోరారు. వివాహ వార్షికోత్సవం నాడు మొక్కలు నాటి సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఈ దంపతులకు పలువురు ప్రముఖులు, స్థానికులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.




