- సీతారాంపేట్ మూల మలుపులో తప్పిన పెను ప్రమాదం
- తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు బైకర్లు
- అభివృద్ధి పేరుతో కాగ్నా నది ఇసుక అక్రమ తోడివేత
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో ఇసుక మాఫియా అక్రమ రవాణా, అతివేగం అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. బుధవారం పట్టణంలోని సీతారాంపేట్ పరిధిలో ఇసుక లోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత తాండూరు ప్రాంతం నుండి ఇసుకను లోడు చేసుకుని ఒక ట్రాక్టర్ సీతారాంపేట్ మీదుగా అతివేగంగా దూసుకొచ్చింది. అక్కడి ఒక మూల మలుపు వద్దకు రాగానే వేగాన్ని నియంత్రించలేక ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అదే సమయంలో ఆ మలుపు గుండా బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. పట్టణంలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులు, అభివృద్ధి కార్యక్రమాల పేరు రంగు పూసి.. కొందరు అక్రమ ఇసుక దోపిడీదారులు కాగ్నా నదిని గుల్ల చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్ల ద్వారా కాగ్నా నది నుండి యథేచ్ఛగా ఇసుకను తోడి తరలిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జనావాసాలు, ఇరుకైన పట్టణ రోడ్ల గుండా ఈ ఇసుక ట్రాక్టర్లు విపరీతమైన వేగంతో నడుపుతుండటంతో స్థానికులు భయాందోళనలో పడ్డారు.





