- పెద్దెముల్ మండలం ఖానాపూర్ గ్రామ వాగులో అక్రమ ఇసుక రవాణా జోరు
- రైతుల దారుల ధ్వంసం – అడ్డుకున్న రైతుపై బెదిరింపులు
- పెద్ద పోలీస్ స్టేషన్లో రైతుల ఫిర్యాదు
జనవాహిని ప్రతినిధి పెద్దేముల్ : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం ఖానాపూర్ గ్రామ పరిధిలోని వాగు నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. అధికారులు, పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల నుంచి వినిపిస్తున్నాయి.గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న దారులను ఇసుక ట్రాక్టర్ల రాకపోకలతో ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ట్రాక్టర్ల సంచారంతో దారి పూర్తిగా పాడైపోయిందని బాధిత రైతు తెలిపారు.ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో ఇసుక ట్రాక్టర్లను అడ్డగించి, దారిని ధ్వంసం చేయవద్దు, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని చెప్పగా, ట్రాక్టర్ యజమానులు రైతుపై దాడికి దిగడమే కాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో… చంపేస్తాం అంటూ బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు.ఈ ఘటనపై బాధిత రైతు ఈరోజు పెద్దెముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై వెంటనే చర్యలు తీసుకుని రైతులకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.




