- రోహిత్ రెడ్డి ప్రజాదరణ చూసి ఓర్వలేకే విమర్శలు
- మున్సిపల్ కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్
తాండూరు (జనవాహిని ప్రతినిధి):
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాండూరు నియోజకవర్గ ప్రజలు, బిఆర్ఎస్ శ్రేణులు అందించిన అపూర్వ స్వాగతాన్ని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని తాండూరు మున్సిపల్ 36వ వార్డు కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఈ సందర్భంగా రూప రుద్రు పాటిల్ మాట్లాడుతూ… పైలట్ రోహిత్ రెడ్డికి తాండూరు ప్రజల్లో ఉన్న తిరుగులేని క్రేజ్, ప్రజాదరణ చూసి కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడే ఓటమి భయం, వణుకు మొదలైందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడికి కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా గజమాలతో బ్రహ్మరథం పడితే, దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు ప్రాపగండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
క్రమశిక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి అస్సలు లేదని, ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, ముఠా రాజకీయాలు తాండూరు ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, కేవలం ప్రచార ఆర్భాటం కోసం బిఆర్ఎస్ పార్టీపై, తమ నాయకుడిపై విషం చిమ్మడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతటి కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలు చేసినా తాండూరు ప్రజలు రోహిత్ రెడ్డి వెంటే ఉన్నారని, ఆయనకున్న ప్రజాదరణను తగ్గించడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు.