- ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగితే సహించను
- ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
- అధికారులను హెచ్చరించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం యాలాల్ మండలంలోని జుంటుపల్లి, బెన్నూర్, యాలాల్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వసతులు, గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాల పనితీరును ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది రైతుల సౌకర్యం కోసమే అన్నారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని,కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, నాణ్యతా ప్రమాణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదు అని స్పష్టం చేశారు.ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు, మిల్లర్లు, రైతులు సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు పెరగకుండా, ఎప్పటికప్పుడు మిల్లర్లకు తరలించేలా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడటంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




