- తాండూరు కాంగ్రెస్ విధేయులకు సముచిత స్థానం కల్పించండి
- పీసీసీ అధ్యక్షులకు ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి విజ్ఞప్తి
- మున్సిపల్ మాజీ పట్టణ అధ్యక్షులు లీడర్ ప్రభాకర్ గౌడ్ పేరు ప్రతిపాదన
జనవాహిని ప్రతినిధి తాండూరు : పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి వెన్నంటి ఉండి, నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పీసీసీ అధ్యక్షులను కోరారు. గురువారం హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.తాండూరు గడ్డ కాంగ్రెస్కు కంచుకోట అని, అసెంబ్లీ ఎన్నికల నుండి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేసి పార్టీకి భారీ మెజారిటీని కట్టబెట్టారని ఎమ్మెల్యే వివరించారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలంటే కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు దక్కాలని ఆయన కోరారు.ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మున్సిపల్ మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ పేరును ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిపాదించారు. మూడు దశాబ్దాలుగా పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా, పట్టణ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను పీసీసీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ప్రభాకర్ గౌడ్ వంటి నాయకులకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి కట్టబెడితే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.అనంతరం ప్రభాకర్ గౌడ్ రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫైలును పీసీసీ అధ్యక్షులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు.




