- ఎస్పీ స్నేహ మెహ్రాకు గోశాల సేవా సమితి వినతి
- విధి నిర్వహణలో నిబద్ధతకు ఎస్పీ కి ఘన సన్మానం
జనవాహిని ప్రతినిధి తాండూరు : బక్రీద్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలో అక్రమ పశు రవాణాను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు గోశాల సేవా సమితి ప్రతినిధులు కోరారు. బుధవారం సమితి సభ్యులు ఐపీఎస్ అధికారిణి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోసంరక్షణలో పోలీసు శాఖ చూపుతున్న చొరవను అభినందిస్తూ ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. చట్టవిరుద్ధంగా పశువుల తరలింపును అడ్డుకోవడానికి పోలీసు శాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచామని, ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందితే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బక్రీద్ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.అనంతరం గోశాల సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ.. పండుగ ముసుగులో జరిగే అక్రమ గోరవాణా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, దీనిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం సంతోషకరమన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




