- కాన్వాయ్ ఆపి దివ్యాంగురాలి పరామర్శ
- పింఛన్, ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఆదేశం
- మానవత్వం చాటుకున్న మనోహర్ అన్న
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఆయన మరోసారి నిరూపించారు.నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం అంతారం తండా నుండి తిరిగి వస్తున్న సమయంలో మల్ రెడ్డి పల్లి రహదారి పక్కన ఒక దివ్యాంగ మహిళ సహాయం కోసం ఎదురుచూస్తుండటం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీనితో ఆయన వెంటనే తన వాహనాన్ని నిలిపివేసి, సదరు మహిళ వద్దకు వెళ్లారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ప్రభుత్వం నుంచి తనకు అందాల్సిన సాయం గురించి ఆరాతీశారు.తమకు దివ్యాంగ పింఛన్ రావడం లేదని, అలాగే నివాసం ఉండటానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితురాలు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. తక్షణమే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితురాలికి అర్హత ప్రకారం దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని, అలాగే ఆమెకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రోటోకాల్ను పక్కన పెట్టి, సామాన్య మహిళ వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ‘బిఎంఆర్’ తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్న ప్రజాప్రతినిధిగా ఆయన సేవాభావాన్ని నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు.




