- మున్సిపాలిటీలో ‘కో-ఆప్షన్’ రాజకీయం
- కాంగ్రెస్ తీరుపై బీజేపీ నిప్పులు
- అర్హతలకు పాతర.. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలేనా..?
- కాంగ్రెస్ తిరుపై బీజేపీ నాయకుల ఫైర్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక విపక్షాల విమర్శలకు పదును పెట్టింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం పట్టణ పరిపాలనలో అనుభవం, పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఆ పదవులను కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసిందని బీజేపీ కౌన్సిలర్లు దుయ్యబట్టారు.మున్సిపల్ వైస్ చైర్మన్ మొదలుకొని మెజారిటీ కౌన్సిలర్ల వరకు ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్, కో-ఆప్షన్లలోనూ అదే పంథాను కొనసాగించడం పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనారిటీలంటే కేవలం ఒక వర్గమేనా అని, క్రైస్తవులకు ఈ ప్రభుత్వంలో చోటు లేదా అని వారు నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలు ఉన్న సమాజంలో ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ ప్రభుత్వం ఏ రకమైన సంకేతాలు ఇస్తుందని మండిపడ్డారు. కేవలం పదవుల్లోనే కాకుండా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని వారు ఆరోపించారు. ఒకే వర్గానికి అన్ని అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు.కాంగ్రెస్ కుటిల నీతిని పట్టణ ప్రజలు గమనించాలన్నారు. అర్హత ఉన్న మేధావులను విస్మరించి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ఎంపికలు జరిగాయన్నారు బీజేపీ తరపున మేము ఈ అక్రమాలను ఎండగడతామన హెచ్చరించారు. తప్పుడు నిర్ణయాలపై కౌన్సిల్ వేదికగా పోరాటం చేస్తాం అని బీజేపీ కౌన్సిలర్లు శ్రీకాంత్, కిరణ్ లు హెచ్చరించారు.




