- పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
- అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
- రికార్డుల నిర్వహణపై ఆరా
జనవాహిని ప్రతినిధి తాండూరు : కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె పెద్దేముల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పనితీరును, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.స్టేషన్కు చేరుకున్న ఎస్పీ తొలుత పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎస్హెచ్ఓ గది, రిసెప్షన్ కౌంటర్, రైటర్స్ రూమ్, లాకప్ గదులు మరియు మహిళా, పురుషుల బ్యారక్లను తనిఖీ చేశారు. రిసెప్షన్ వద్దకు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెద్దేముల్ ప్రాంతం అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వరి అక్రమ రవాణాపై దృష్టి సారించాలన్నారు. రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని సరిహద్దుల గుండా అక్రమంగా పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద కఠిన నిఘా ఉంచాలని అధికారులను హెచ్చరించారు.బ్లూ కోల్ట్స్, సెక్షన్ హెడ్ కానిస్టేబుళ్లు మరియు మహిళా సిబ్బందితో ఆమె ముఖాముఖి మాట్లాడారు. డైల్ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దొంగతనం కేసులను ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని, నిందితులను త్వరగా పట్టుకోవాలని చెప్పారు. సిబ్బంది పని ఒత్తిడికి గురికాకుండా ఎస్హెచ్ఓలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.




