- హైదరాబాద్ సభలో రిజర్వేషన్లపై మోదీ ప్రకటన చేయాలి
- బీసీ కుల గణనపై కేంద్రం వెనకడుగు వేయొద్దు
- తాండూరు బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్ డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ బీసీల ఆకాంక్షలను నెరవేర్చేలా స్పష్టమైన హామీ ఇవ్వాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధనపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని రాజ్కుమార్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించేందుకు కేంద్రం తక్షణమే రాజ్యాంగ సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్త కుల గణన అనేది బీసీల ప్రాథమిక హక్కు అని, దీనిపై మోదీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీపై తమకు గౌరవం ఉందని, అయితే ఆ గౌరవం బీసీల రాజకీయ ఎదుగుదలకు తోడ్పడినప్పుడే సార్థకమవుతుందని అన్నారు.కేవలం ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అనే నినాదాలతో తెలంగాణలో అధికారం సాధ్యం కాదని, బీసీలకు రాజకీయ భరోసా ఇవ్వకుంటే అది ఒక కలగానే మిగిలిపోతుందని రాజ్కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్ బహిరంగ సభ సాక్షిగా బీసీల రిజర్వేషన్లపై కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




