- డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పారదర్శకం
- నిజమైన పేదలకు అన్యాయం జరగనివ్వం
- 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ మరియు జిఎంకే ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని కాంగ్రెస్ పార్టీ 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ, బిఆర్ఎస్ నేతలు ఉనికి కోసమే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.నిరుపేదలకు ఇళ్లు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, రాజకీయ లబ్ధి కోసం దానిపై బురదజల్లడం సరికాదన్నారు. జిఎంకే ట్రస్ట్ ద్వారా సామాజిక బాధ్యతగా జరుగుతున్న సేవా కార్యక్రమాలను తప్పుబట్టడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుందని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు.తాండూరులో హిందూ-ముస్లింలు సోదరభావంతో కలిసి ఉంటున్నారని, మతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరూ చేసినా సహించేది లేదని ఎల్లప్ప హెచ్చరించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉండి పేదలను పట్టించుకోని వారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు.అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందే వరకు తాము అండగా ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అభివృద్ధికి సహకరించాలని బిఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.




