- రిమాండ్ ముగిసి విడుదలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
- ఆత్మీయంగా పలకరించిన అంతారం గ్రామ నేతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : అక్రమ కేసులో చిక్కుకుని గత 45 రోజులుగా రిమాండ్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. ఈ వార్త తెలియగానే నియోజకవర్గంలోని ఆయన అనుచరులు, అభిమానులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు.రోహిత్ రెడ్డి విడుదలైన సందర్భంగా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన నేత 12వ వార్డుకు చెందిన సేరి విజేందర్ రెడ్డి మరియు సుందర్ శ్రీనివాస్ రెడ్డిలు ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత తమ నాయకుడిని చూసిన ఆనందంలో వారు ఎంతో ఆప్యాయంగా “పటేలా.. ఎట్లా ఉన్నావు!” అంటూ పలకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించారని, న్యాయం చివరకు గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రోహిత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అంతారం నుండి తరలివచ్చిన నేతలు తమ ప్రియతమ నాయకుడికి ధైర్యం చెబుతూ, నిరంతరం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.



