- బ్రహ్మంగారి కాలజ్ఞానం మార్గదర్శకం
- ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి
- తాండూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన
జనవాహిని ప్రతినిధి తాండూరు : సమాజంలో రాబోయే మార్పులను తన కాలజ్ఞానంతో ముందే దర్శించి, లోకాన్ని చైతన్య పరిచిన గొప్ప మహనీయుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ పరిధిలోని బ్రహ్మంగారి గుట్ట పై నూతనంగా నిర్మించ తలపెట్టిన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారి బోధనలు నిత్య నూతనమని, భవిష్యత్తును ముందే ఊహించి చెప్పిన ఆయన శక్తీ అమోఘమని కొనియాడారు. భక్తి మార్గం ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తాండూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం శుభపరిణామమని పేర్కొన్నారు.దేవాలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాండూరు ప్రాంత ప్రజలందరిపై ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




