- రూ.కోట్ల విలువైన 16 గుంటల భూమిలో అక్రమ నిర్మాణాలు
- రాత్రి వేళల్లో రహస్యంగా పనులు..
- అధికారులకు బిఆర్ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణ నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయం ఎదుటే విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని బిఆర్ఎస్ కౌన్సిలర్ లు ఆరోపించారు. సర్వే నంబర్ 130లోని సుమారు 36 గుంటల ప్రభుత్వ భూమిలో ఒక వ్యక్తి అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ 12 మంది కౌన్సిలర్లు గురువారం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.కౌన్సిలర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మెయిన్ రోడ్ ఫేసింగ్ భూమికి గజానికి దాదాపు ₹80,000/- మార్కెట్ విలువ ఉందన్నారు. అమేర్ అబ్దుల్లా అనే వ్యక్తి ఇందులో సుమారు 16 గుంటల భూమిని ఆక్రమించి పనులు మొదలుపెట్టారని తెలిపారు. అధికారుల కళ్లుగప్పేందుకు పగలు పనులు ఆపేసి, రాత్రి 12 గంటల సమయంలో అత్యంత గోప్యంగా నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో సర్వే నంబర్ 111లో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, అప్పట్లో చర్యలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు మరికొందరు ధైర్యంగా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నారని కౌన్సిలర్లు మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. వెంటనే సదరు అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, కూల్చివేయాలని,ఆక్రమణకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలిని పట్టణంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కౌన్సిలర్ లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.




