- ప్రపంచానికే స్ఫూర్తిదాయకం బాబాసాహెబ్ పోరాటం
- విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యం
- అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను తాండూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ మరియు అంబేద్కర్ పార్క్లో ఉన్న ఆయన విగ్రహాలకు ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోని గొప్ప విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన అంబేద్కర్, విదేశాల్లో స్థిరపడి ఎంతో సంపదను సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారని కొనియాడారు. తన మేధస్సుతో భారత రాజ్యాంగాన్ని రచించి, దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు.విద్యతోనే వికాసం, తద్వారా ప్రగతి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో అత్యాధునిక వసతులతో ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగి సమాజంలోని అసమానతలను తొలగించాలని ఆకాంక్షించారు.నేటి యువత డ్రగ్స్, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, అంబేద్కర్ చూపిన బాటలో నడిచి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.కార్యక్రమం అనంతరం అంబేద్కర్ పార్క్లో ఏర్పాటు చేసిన విందులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సామాన్య ప్రజలు, నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మేధావులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



