- క్షేత్రస్థాయిలో సమస్యలు విన్న మనోహర్ రెడ్డి
- మిషన్ భగీరథ నీరు వెంటనే అందించాలని ఛైర్పర్సన్కు ఆదేశం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు మిత్ర నగర్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పచ్చజెండా ఊపారు. కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వార్డు ప్రజలంతా ఏకమై ఎమ్మెల్యేను కోరగా, ఆయన సోమవారం కాలనీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్న ప్రజల విన్నపంపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజలకు తాగునీరు అందేలా చూడాలని మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డిని అక్కడికక్కడే ఆదేశించారు. ప్రజలకు కనీస అవసరమైన నీటి విషయంలో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.కాలనీలో అధ్వానంగా ఉన్న రహదారుల గురించి స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గమనించి, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్లు వేయించాలని అధికారులకు సూచించారు.వార్డు అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, కాలనీ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పర్యటనతో మిత్ర నగర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.



