- తాండూరును స్వచ్ఛ సుందర పట్టణంగా తీర్చిదిద్దుదాం
- ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన ర్యాలీ
- చెత్తను రోడ్లపై వేయొద్దు: మున్సిపల్ ఛైర్పర్సన్ పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణ ప్రజలందరి సహకారంతో తాండూరును స్వచ్ఛ మరియు పచ్చని పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా స్వచ్ఛతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బంది, ఆఫీసర్లు, జవాన్లు ప్రాణాలకు తెగించి మురుగు కాలువలు శుభ్రం చేస్తూ పట్టణాన్ని కాపాడుతున్నారని, వారి శ్రమను ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజలు తమ ఇళ్లను ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటారో, అదే విధంగా తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నుండి వచ్చే చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో వేయకుండా, మున్సిపల్ చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడే అందులో వేయాలని సూచించారు.అనంతరం పట్టణంలోని బస్టాండ్, భద్రప్ప చౌక్, శివాజీ చౌక్, ఇందిరా చౌక్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందిరా చౌక్ కూడలి వద్ద ఉన్న ఫౌంటెన్కు రంగులు వేయించి, మున్సిపల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. భవిష్యత్తులో తాండూరును అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఈ యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, జవాన్లు మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.






