బీసీల ఓట్లు కావాలి.. బడ్జెట్ నిధులు ఇవ్వరా..?

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • ప్రభుత్వానిది బీసీల పట్ల మొండివైఖరే..! 
  • ₹50 వేల కోట్లతో బడ్జెట్ ప్రకటించాలి, కందుకూరి రాజ్‌కుమార్ ధ్వజం

జనవాహిని ప్రతినిధి తాండూరు : మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ కేటాయింపులు మాత్రం గడప దాటడం లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ సంఘం నేత కందుకూరి రాజ్‌కుమార్ నిప్పులు చెరిగారు. సోమవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీల సంక్షేమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 'కామారెడ్డి డిక్లరేషన్' పేరిట బీసీల ఓట్లను దండుకుందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను బుట్టదాఖలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఏటా ₹20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, బడ్జెట్‌లో కేవలం అరకొర నిధులతో (గత రెండేళ్లలో ₹9,200 కోట్లు, ₹11,405 కోట్లు) సరిపెట్టడం బీసీలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాబోయే బడ్జెట్‌లో బీసీలకు ఏకంగా ₹50 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీ సబ్ ప్లాన్‌కు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని,ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడం వల్ల వేలమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం ₹5,000 కోట్లు కేటాయించాలన్నారు.నామమాత్రంగా మారిన కుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నిధులు ఇచ్చి ప్రాణం పోయాలని డిమాండ్ చేశారు.ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలే ప్రభుత్వానికి ఆఖరి అవకాశమని, బీసీల డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కందుకూరి రాజ్‌కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *