- రేవంత్ రెడ్డి పై కేటీఆర్ నిప్పులు
- రెండేళ్లలో కాంగ్రెస్ దుకాణం బంద్..
- తాండూరులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గర్జన
జనవాహిని ప్రతినిధి తాండూరు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ‘భస్మాసురుడు’ రేవంత్ అని, ఆయన పాలనలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని మండిపడ్డారు. ఆదివారం తాండూరు రోడ్ షోలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భస్మం చేస్తోందని, ఈ భస్మాసుర హస్తం వల్ల ప్రజలు గోస పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ పని ఖతం కావడం ఖాయమని హెచ్చరించారు.రేవంత్ రెడ్డిని ‘అనుముల రెడ్డి’ అని కాకుండా, ‘లాగుల తొండల రెడ్డి’ అంటూ సంబోధిస్తూ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ బీజేపీ ఏజెంట్లాగే వ్యవహరిస్తున్నారని, ఆయన మనసంతా ఆ పార్టీపైనే ఉందని ఆరోపించారు.మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు అంటూ తాండూరు నర్సింగ్ కాలేజీ అంశాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే, వెంటనే నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ వాడు కాలేడని, ఆయన అసలు రంగు బీజేపీయేనని కేటీఆర్ విశ్లేషించారు. కాంగ్రెస్ను ముంచేందుకే రేవంత్ అక్కడ ఉన్నారని వ్యాఖ్యానించారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. “ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారు. రాసి పెట్టుకోండి.. మరో రెండేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదు” అని జోస్యం చెప్పారు.అరకొర హామీలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని కేటీఆర్ హెచ్చరించారు. ఈ రోడ్ షోలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ ప్రసంగం పొడవునా రేవంత్ రెడ్డి టార్గెట్గా సాగిన విమర్శలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.






