- తాండూర్ కృష్ణవేణి స్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
- ఆకట్టుకున్న ‘ఆజాదీ కీ అమర్ గాథ’ నాటకం
జనవాహిని ప్రతినిధి తాండూర్: తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా, దేశభక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ & మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మార్చ్ పాస్ట్, నేవీ కేడెట్ల బ్యాడ్జ్ ప్రెజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీ మల్లేశం, శ్రీ వెంకటేశం, శ్రీ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆజాదీ కీ అమర్ గాథ (1857-1947) చారిత్రక నాటకం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వాతంత్ర్య పోరాటంలోని ఘట్టాలను విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అనంతరం ఈ నాటకాన్ని తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనూ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాండూర్ శాసనసభ్యులు బి. మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు ప్రముఖులు విద్యార్థుల ప్రతిభను, వారి వెనుక ఉన్న ఉపాధ్యాయుల శ్రమను అభినందించారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన స్వతంత్ర దినోస్తావా వేడుకల్లో జూనియర్ కేజీ చిన్నారి తన అద్భుత జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్న వయసులోనే దేశంలోని రాష్ట్రాలు, రాజధానుల పేర్లతో పాటు శ్లోకాలను స్పష్టంగా చెప్పి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే 3, 5 తరగతుల విద్యార్థుల దేశభక్తి గీతాలు, ప్రసంగాలు సభికులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
