- గాంధీనగర్లో వైభవంగా కట్టమైసమ్మ జాతర
- ఆకట్టుకున్న భక్తుల బోనాల ఊరేగింపు
- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్
- పార్టీలతీతంగా హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణ పరిధిలోని గాంధీనగర్లో కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు 20వ వార్డ్ కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాలనీకి చెందిన మహిళలు, భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలను తలపై పెట్టుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు నైవేద్యంగా సమర్పించి,తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.ఈ వేడుకల్లో వార్డు కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపైకి వచ్చి ఉత్సవాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులతో కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పట్టణం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీవాసులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను జయప్రదం చేశారు.
