డీలిమిటేషన్ వేళ ఎన్డీయేకు గుడ్ న్యూస్..! తిరిగొచ్చిన పాత మిత్రపక్షం..!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లు (Delimitation bill 2026) త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది. గతంలో ఇదే బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. నెగ్గించుకోవడంలో విఫలమైంది. దీంతో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. టీఎంసీ, ఆప్, శివసేన వంటి విపక్షాలను చీల్చి ఇప్పటికే భారీ సంఖ్యలో ఎంపీల్ని తమవైపు తిప్పుకుంది. అదే సమయంలో గతంలో తమతో తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయిన మాజీ మిత్రపక్షం ఒకటి ఇప్పుడు తిరిగి ఎన్డీయేలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
నిన్న ప్రధాని మోడీతో పంజాబ్ లో విపక్ష శిరోమణి అకాలీదళ్ (Shiromani Akali Dal) అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ సమావేశమయ్యారు. ఇది జరిగిన 24 గంటల్లోనే ఆయన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఇక మిగిలింది అకాలీదళ్ తిరిగి ఎన్డీయేలో చేరిపోవడం, పంజాబ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీతో కలిసి బరిలోకి దిగడమే. ఇవాళ డీలిమిటేషన్, మహిళా బిల్లులకు మద్దతిస్తున్నట్లు అకాలీదళ్ చేసిన ప్రకటన తర్వాత ఈ మేరకు ఊహాగానాలు మొదలయ్యాయి. చండీఘడ్ లో ఇవాళ అకాలీదళ్ నేతలు సమావేశమయ్యారని, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించారని బాదల్ ట్వీట్ చేశారు.

మహిళల గౌరవం, సమానత్వం, సమాన హక్కుల కోసం పోరాడిన సిక్కు గురువుల బోధనల నుండి శిరోమణి అకాలీ దళ్ స్ఫూర్తిని పొందుతుందని ఆయన తెలిపారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తన సభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఇప్పటికే ఒక ఆదర్శాన్ని నెలకొల్పిందని ఆయన గుర్తుచేశారు. పార్లమెంటు ముందున్న కీలక అంశాలపై సమగ్ర చర్చల అనంతరం, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా న్యాయమైన, సమతుల్యమైన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని శిరోమణి అకాలీ దళ్ డిమాండ్ చేసింది. వాస్తవానికి ఏప్రిల్లో కేంద్రం తొలిసారిగా డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అకాలీ దళ్ దానిని వ్యతిరేకించి, ప్రతిపక్షాలతో కలిసి వ్యతిరేకంగా ఓటు వేసింది. అప్పట్లో ఈ బిల్లు పంజాబ్కు వివక్షాపూరితమైనదని, దీనివల్ల రాష్ట్రానికి కేవలం స్వల్ప సీట్లు మాత్రమే పెరుగుతాయని, పొరుగు రాష్ట్రాలు ఎక్కువ సీట్లు లభిస్తాయని ఆరోపించింది. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది.

