పదో తరగతి అర్హత.. ఆర్మీలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్…
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ ఆర్మీ డిపోలు, యూనిట్లలో ఖాళీగా ఉన్న గ్రూప్-సి సివిలియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో సుస్థిరమైన కొలువు సాధించాలని కలలు కనే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా నిలవనుంది. పదో తరగతి పాసైన వారి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారి వరకు వివిధ విభాగాల్లో మొత్తం 2,615 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ట్రేడ్స్మెన్ మేట్ విభాగంలో 1,799 పోస్టులు ఉన్నాయి. వీటికి తోడు ఫైర్మెన్ 520, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) 142, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) 104, మెటీరియల్ అసిస్టెంట్ 50 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులకు ఇంగ్లిష్ లేదా హిందీలో కంప్యూటర్ టైపింగ్ ప్రవేశం తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానం , కీలక తేదీలు
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (PET – పోస్టును బట్టి), టైపింగ్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన , మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల (ఆగస్టు) 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, వయోపరిమితి, జీత్యభత్యాలు , ఇతర సమగ్ర సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://aocrecruitment.gov.in/ ను సందర్శించవచ్చు.

