NEET UG: నీట్ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం..! సుప్రీంకోర్టులో అఫిడవిట్ ..!
ఈ ఏడాది వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ స్దాయి పరీక్ష నీట్ (NEET UG 2026) ప్రశ్నాపత్రాల లీక్ కారణంగా రద్దయింది. దీంతో కేంద్రం రీటెస్ట్ నిర్వహించింది. అయినా నీట్ పేపర్ లీక్ పై వచ్చిన ఆరోపణలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే కాకుండా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకపై నీట్ పరీక్ష ఎలా నిర్వహించాలన్న దానిపై టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సూచనల ప్రకారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇందులో కేంద్రం ఇకపై నీట్ యూజీ పరీక్షను ఆన్ లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం అమలు చేస్తున్న పెన్ అండ్ పేపర్ పద్ధతి నుంచి జేఈఈ తరహాలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మారబోతున్నట్లు కేంద్రం ఇందులో వెల్లడించింది. ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయాలని పిటిషనర్లను జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.

ఈ లోగా వైద్యుల సంఘాలతో పాటు పిటిషనర్లు అందరూ కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై తమ సమాధానాలను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల్లో పారదర్శకత కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన తర్వాతే కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. భవిష్యత్తులో నీట్ పరీక్షల భద్రతను పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనికోసం నందన్ నిలేకని అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని అఫిడవిట్లో పేర్కొంది. దీనిపై స్పందించిన పిటిషనర్లు.. విద్యార్థులు ఇప్పటికే పాత విధానానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతున్నారని, ఒకవేళ ఆన్లైన్ విధానంలోకి మారాలనుకుంటే, ఆ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా ప్రకటించాలని కోరారు. దీనివల్ల అభ్యర్థులకు కొత్త విధానంపై సన్నద్ధమవడానికి తగిన సమయం దొరుకుతుందని పేర్కొన్నారు.

