- తాండూరులో మోరాయించిన ‘నిఘా నేత్రాలు’
- పనిచేయని పోలీస్ సీసీ కెమెరాలు
- వీడని బంగారం దుకాణం చోరీ గుట్టు
- ప్రైవేట్ ఫుటేజీలపైనే ఆధారపడుతున్న పోలీసులు
- నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజల డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు అత్యంత కీలకమైన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా తాండూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రాంతాల్లో పోలీస్ శాఖకు చెందిన కెమెరాలు సాంకేతిక లోపాలతో నిలిచిపోవడంతో నేరస్థులకు సానుకూలంగా మారుతోంది.ఇటీవల పట్టణంలోని ఓ ప్రముఖ బంగారం దుకాణంలో జరిగిన చోరీ కేసే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఘటన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం ప్రభుత్వ సీసీ కెమెరాలను పరిశీలించగా, అవి పనిచేయడం లేదని తేలింది. దీంతో దొంగలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు స్థానిక ప్రైవేట్ వ్యాపార సముదాయాలు, నివాసాల వద్ద ఉన్న కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.గతంలో అనేక సంక్లిష్టమైన దొంగతనాలు, ఇతర నేరాల కేసులను సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగానే తాండూరు పోలీసులు వేగంగా ఛేదించి ప్రశంసలు అందుకున్నారు. “మూడో కన్ను.. వంద మంది పోలీసులతో సమానం” అని పోలీసులే స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించేవారు. అలాంటిది ఇప్పుడు వారి ఆధ్వర్యంలోని కెమెరాలే మోరాయించడంతో విచారణ అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారింది. పట్టణంలో నిఘా వ్యవస్థ పడకేయడంతో దొంగలు విజృంభిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తాండూరులోని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టి క్రమం తప్పకుండా నిర్వహణ చూసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పట్టణ వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో మరిన్ని కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజా భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.