- తాండూర్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో వైభవంగా ఇన్వెస్టిచర్ వేడుకలు
- విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
- తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య
జనవాహిని ప్రతినిధి తాండూరు: బాల్యం నుండే విద్యార్థులు సేవా భావం పెంపొందించుకోవాలని తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదయ్య అన్నారు. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రమాణ స్వీకార వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, శాష్లు తొడిగి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ… విద్యార్థులు బాల్యం నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం పెంపొందించుకుని సమాజానికి ఆదర్శంగా ఎదగాలని పిలుపునిచ్చారు.పాఠశాల హెడ్ బాయ్గా చరణ్ సాయి, హెడ్ గర్ల్గా లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ హెడ్ బాయ్గా సాకేత్, డిప్యూటీ హెడ్ గర్ల్గా వర్ధిని ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు వివిధ రంగాలు మరియు హౌస్ల కెప్టెన్లు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన కవాతు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.స్పీడలాబ్స్ నిర్వహించిన జాతీయ స్థాయి ఐఐటీ /నీట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి జాతీయ 1వ ర్యాంకు సాధించిన జి. స్పృథిక, ఎం. గీతిక త్రినయన, 2వ ర్యాంకర్ బి. ఆరోషి, 3వ ర్యాంకర్ కె. లక్ష్మీ ప్రసన్నలను ఈ సందర్భంగా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.పాఠశాల హెచ్.ఎం,ఎం.డి ప్రశాంత్ మాట్లాడుతూ… నిజమైన నాయకత్వం అనేది సేవ, వినయంలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సతీష్, వెంకటేశం, మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.