- రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ విమర్శలు
- రోహిత్ రెడ్డి ని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు
- సొంత వార్డు అభివృద్ధిని విస్మరించిన మున్సిపల్ చైర్పర్సన్
- యువజన అధ్యక్షుడు అనిల్ బాండ్
జనవాహిని ప్రతినిధి,తాండూరు:కేవలం రాజకీయ లబ్ధి, సొంత ఉనికిని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై వ్యర్థమైన విమర్శలు చేస్తున్నారని తాండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ బాండ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ముందుగా విలువలతో కూడిన రాజకీయం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిల్ బాండ్ మాట్లాడుతూ…. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగును హెచ్చరించారు. పట్టణ అధ్యక్షులు నాగు గతాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని, రాజకీయం ఉనికి కోసం ఎవరో ఎదో చెప్పారని మాజీ ఎమ్మెల్యే పై విమర్శలు చేయ్యడం తగదన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిన మున్సిపల్ చైర్పర్సన్, ఇప్పుడు ఆ గతాన్ని మరిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాండూరు అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు నిజాయితీగా కృషి చేస్తే ఆహ్వానిస్తామని, అంతేకానీ అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ ముందుగా తన సొంత 12వ వార్డు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ఆ తర్వాతే తాండూరు అభివృద్ధి గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఒకప్పుడు మహేందర్ రెడ్డిని ‘అన్న’ అని, ఇప్పుడు మనోహర్ రెడ్డిని ‘దైవం’ అని సంబోధిస్తున్న కాంగ్రెస్ నాయకుల స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.పేదలకు ఆశాకిరణం,స్థానిక నాయకుడిగా రోహిత్ రెడ్డి పేద, బలహీన వర్గాలకు అండగా నిలిచారని కొనియాడారు. నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని మహా చండీ యాగం నిర్వహించిన గొప్ప మనసు ఆయనదని గుర్తుచేశారు. తన పదవీ కాలంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి తాండూరును అభివృద్ధి పథంలో నడిపిన ఘనత రోహిత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.తాత్కాలిక అధికారాన్ని చూసుకుని కాంగ్రెస్ నాయకులు అతిగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పడానికి బిఆర్ఎస్ యువజన విభాగమే సరిపోతుందని, ఇప్పటికైనా ఆలోచించి మాట్లాడాలని అనిల్ బాండ్ స్పష్టం చేశారు.