- సర్వే నెం. 52లో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అక్రమ యత్నం
- కమిషనర్కు ఫిర్యాదు చేసిన వార్డు కౌన్సిలర్ బి. అనిల్ కుమార్
- కోట్లాది రూపాయల ప్రజా ఆస్తిని రక్షించాలని డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని మాల్రెడ్డిపల్లి శివారులో గల విలువైన మున్సిపల్ ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలు కాకుండా తక్షణమే రక్షించాలని వార్డు నెం. 6 కౌన్సిలర్ బి. అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వార్డు ప్రజలతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. మాల్రెడ్డిపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 52లో మున్సిపాలిటీకి చెందిన 13 ఎకరాల 12 గుంటల భూమిపై కొందరు వ్యక్తులు, సంస్థలు చట్టవిరుద్ధంగా ఆక్రమణలకు తెరలేపారని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సదరు సర్వే నెంబర్ 52లోని భూమిని 1964 మే 5వ తేదీన (రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం. 202/1964 ద్వారా) అప్పటి మున్సిపల్ కౌన్సిల్ కొనుగోలు చేసిందని రికార్డులను గుర్తు చేశారు. ఇందులో కొంత భాగాన్ని మున్సిపల్ భవనాలు, విద్యుత్ శాఖ కార్యాలయం మరియు రాఘవేంద్ర కాలనీ అభివృద్ధి కొరకు గతంలోనే ఉపయోగించారని, మిగిలిన గణనీయమైన భూమి మున్సిపల్ రికార్డుల ప్రకారం ఇప్పటికీ మున్సిపాలిటీ యాజమాన్యంలోనే ఉందన్నారు. అయితే, ఇటీవల కాలంలో ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు లేని కొందరు వ్యక్తులు ఈ భూమిని కాజేసేందుకు అక్రమంగా కాంపౌండ్ వాల్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవద్దని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఆక్రమణదారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పనులను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తిపై జరిగిన తీవ్రమైన అక్రమణ యత్నమని, దీనివల్ల భవిష్యత్తులో శాంతిభద్రతల సమస్యలు మరియు వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వివాదంపై మున్సిపల్ యంత్రాంగం అత్యవసరంగా స్పందించాలని అనిల్ కుమార్ కోరారు. వివాదాస్పద సర్వే నెం. 52 భూమికి తక్షణమే రెవెన్యూ అధికారులతో అధికారిక సర్వే నిర్వహించి, మున్సిపల్ భూమికి స్పష్టమైన హద్దులను నిర్ణయించాలన్నారు. అదేవిదంగా 52 సర్వే నెంబర్ లో 6వ వార్డ్ కు 40 ఫీట్ల రోడ్డు కూడా టౌన్ ప్లానింగ్ లో ఉందని సర్వే చేసి రోడ్డు పనులు కూడా ప్రారంభించాలని కోరారు. ఆక్రమణ స్థలంలో మున్సిపాలిటీ హెచ్చరికా బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు, అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూమి రికార్డులను బహిర్గతం చేసి పారదర్శకత పాటించాలని, కోట్లాది రూపాయల విలువైన ప్రజా ఆస్తిని భూ ఆక్రమణదారుల బారి నుండి రక్షించాలని అధికారులను కోరారు.




