- మాజీ కౌన్సిలర్ ఫిర్యాదుతో తొమ్మిది మందిపై కేసు నమోదు
- ఆర్. వెంకటి, ప్రకాష్ లపై కేసు
- కావాలనే టార్గెట్ చేశారని మాజీ కాన్సిలర్ ఆరోపణ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ పరిధిలో చోటుచేసుకున్న ఓ భూవివాదం ఉదంతం పోలీస్ స్టేషన్కు చేరింది. కొడంగల్ రోడ్డు మార్గంలో గల సర్వే నెంబర్ 212, ప్లాట్ నెంబర్ 28 స్థలం విషయంలో గురువారం ఇరువర్గాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. వివాదాస్పద స్థలంలో అక్రమంగా చొరబడి, అక్కడ గతంలో నిర్మించిన ఒక షెడ్డును దౌర్జన్యంగా కూల్చివేసి, స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని.. అలాగే ఈ క్రమంలో తనపై భౌతిక దాడికి సైతం వ్యూహం రచించారంటూ తాండూరు మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేశారు.బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తాండూరు పట్టణ పోలీసులు నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితులు ఆర్. వెంకటి (A-1), ప్రకాష్ (A-2) లతో పాటు, వివాద సమయంలో వారి వెంట వచ్చిన మరో ఏడుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 329(3), 324(4), 303(2) r/w 3(5) కింద కేసు బుక్ చేసినట్లు బాధితుడు తెలిపారు. అక్రమంగా మా స్థలం లోకి చొరబడి దౌర్జన్యం చేయ్యడం సమంజసం కాదన్నారు. రాజకీయంగా ఎదురుకొనే దమ్ము లేకే ఇలాంటి పనులు చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కావాలనే నన్ను టార్గెట్ చేస్తూ…. ఎలాగైనా నాపై దాడి చేయాలనే కుట్రతో తప్పుడు పత్రాలు సృష్టించి భూ కాబ్జా చేయాలని ప్రయత్నం చేసారాని పేర్కొన్నారు.




