- మద్యం రహిత వార్డుగా మార్చేందుకు కౌన్సిలర్ జావీద్ సాహసోపేత నిర్ణయం!
- రాజీవ్, ఇందిరమ్మ కాలనీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం
- కౌన్సిలర్ చొరవపై మహిళలు, కాలనీవాసుల హర్షం
- ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. డీఎస్పీకి వినతిపత్రం సమర్పణ
జనవాహిని ప్రతినిధి తాండూరు : సమాజానికి పట్టిన అక్రమ మద్యం చీడను వదిలించి, తన వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తాండూరు 8వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావీద్ ఒక అద్భుతమైన చొరవ తీసుకున్నారు. కాలనీల్లో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ మరియు యువత భవిష్యత్తే ధ్యేయంగా.. 8వ వార్డు పరిధిలోని రాజీవ్ కాలనీ మరియు ఇందిరమ్మ కాలనీల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఆయన శనివారం ఒక తీర్మానం చేశారు. కౌన్సిలర్ తీసుకున్న ఈ మంచి నిర్ణయం పట్ల స్థానిక ప్రజల నుండి, ముఖ్యంగా మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది.ఈ తీర్మానంలో భాగంగా కౌన్సిలర్ జావీద్ స్వయంగా కాలనీలోని అన్ని కిరాణా దుకాణాలు, బెల్ట్ షాపుల యజమానుల వద్దకు వెళ్లి, బాధ్యతాయుతంగా వినతి పత్రాలను అందజేశారు. కాలనీల ప్రశాంతత కోసం వ్యాపారులందరూ సహకరించాలని కోరారు. ఒకవేళ లాభాపేక్షతో ఈ నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే, వారిపై ఏమాత్రం ఉపేక్షించకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.కాలనీల్లో బెల్ట్ షాపులను శాశ్వతంగా నిర్మూలించేందుకు కౌన్సిలర్ జావీద్ ఒక అడుగు ముందుకు వేసి, తాండూరు డీఎస్పీ కి కూడా అధికారికంగా దరఖాస్తును సమర్పించారు. అక్రమ విక్రయదారులపై గట్టి నిఘా పెట్టాలని కోరారు. వార్డు ప్రజల క్షేమం కోసం, కాలనీల్లో గొడవలు లేని ప్రశాంత వాతావరణం కోసం ఒక ప్రజాప్రతినిధిగా కౌన్సిలర్ జావీద్ స్పందించిన తీరు, క్షేత్రస్థాయిలో ఆయన చూపిస్తున్న చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.




