- తలపై కర్రతో బాది చంపిన పెద్ద కుమారుడు
- ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరి వేసిన వైనం
- ఎల్మకన్న గ్రామంలో విషాదం
జనవాహిని ప్రతినిధి తాండూరు : కన్నతల్లి అని కూడా చూడకుండా కేవలం మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కుమారుడు ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ దారుణ ఘటన తాండూరు మండలం ఎల్మకన్న గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రుకాయ బేగంకు తన పెద్ద కుమారుడైన షేక్ మహబూబ్తో ఆదివారం రాత్రి గొడవ జరిగింది. రాత్రి సుమారు 9 గంటల సమయంలో మద్యం సేవించేందుకు మహబూబ్ తన తల్లిని డబ్బులు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నిందితుడు.. ఇంట్లోని కట్టెను తీసుకుని తల్లి తలపై, గొంతుపై మరియు చెవిపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రుకాయ బేగం అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.తల్లి మరణించినట్లు నిర్ధారించుకున్న మహబూబ్, ఈ నేరం నుండి తప్పించుకోవడానికి ఒక పథకం వేశాడు. ఇంట్లోని చీరను తీసుకుని మృతురాలి మెడకు చుట్టి, దూలానికి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశాడు.సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతురాలి కుమార్తె మునీర బేగం పోలీసులను ఆశ్రయించింది. తన తల్లిని అన్న మహబూబ్ డబ్బుల కోసమే కొట్టి చంపాడని, ఆపై ఉరివేసి నాటకమాడాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




