- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు ఊరట
- బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం
- రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
జనవాహిని ప్రతినిధి తాండూరు : మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా చంచల్గూడ జైలులో ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ఇరుపక్షాల వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.కోర్టు ఆదేశాలతో రోహిత్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండటంతో, ఆయన అనుచరులు మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు చంచల్గూడ జైలు వద్దకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. విచారణకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టమైన షరతులు విధించినట్లు సమాచారం.




