– ఏ ఒక్క సంస్థకో ఇళ్ల కేటాయింపు జరగలేదు..
– కేవలం దరఖాస్తుల స్వీకరణ మాత్రమే
– అవినీతికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
– ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దు
– తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కట్టుబడి ఉందని, తాండూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి నిరుపేదకూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆమె ఓ ప్రకటనాలి మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చైర్పర్సన్ తెలిపారు. తాండూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారని, రూ. 2 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ వంటి వసతులు కల్పించి గృహాలను పంపిణీకి సిద్ధం చేశారని వివరించారు.ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా తాండూరు పట్టణంలో ఇప్పటికే 8000 మందిని L2 అర్షులను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, హమాలీ సంఘాలు, మరియు జర్నలిస్టులు తమ పరిధిలోని అర్హుల పేర్లను ఎమ్మెల్యే కు విన్నవించారని తెలిపారు. జీఎంకే ట్రస్ట్ వంటి సంస్థలు కూడా తమ వద్ద ఉన్న నిరుపేదల జాబితాను అందజేశాయని, ఎమ్మెల్యే కేవలం ఆ దరఖాస్తులను స్వీకరించి పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టర్ మరియు హౌసింగ్ బోర్డుకు పంపారని స్పష్టం చేశారు. అంతే తప్ప, నేరుగా ఏ ఒక్క సంస్థకు ఇళ్లను కేటాయించలేదని ఆమె తేల్చి చెప్పారు.ఎమ్మెల్యే కు వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నిజమైన పేదలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారని చైర్పర్సన్ వివరించారు. తుది నిర్ణయం జిల్లా కలెక్టర్ మరియు హౌసింగ్ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుందని, ఎక్కడైనా అవినీతి జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసే కుట్రలను ప్రజలు గమనించాలని ఆమె కోరారు.




