మరో పేపర్ లీక్ ? మళ్లీ చిక్కుల్లో పడ్డ NTA..! ఏం జరుగుతోంది ?
ఈ ఏడాది జాతీయ స్ధాయిలో పలు పోటీ పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలతో విద్యా వ్యవస్థపై నమ్మకం సడలిపోతున్న వేళ.. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వైద్య వైద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో దాన్ని రద్దు చేసిన ఎన్టీఏ .. మరోసారి పరీక్ష నిర్వహించింది. ఈ వివాదంపై సీబీఐ విచారణ కొనసాగుతుండగానే మరో ప్రశ్నాపత్రం లీక్ అయ్యాయన్న వార్తలు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్ల కోసం ఎన్టీఏ గత నెలలో నిర్వహించిన యూజీసీ-నెట్ 2026 (UGC-NET 2026) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు వచ్చాయి. దీంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా జరిగిన పలు జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణపై ఇప్పటికే ప్రశ్నలు తలెత్తగా, తాజా పరిణామం పరీక్షల పారదర్శకతపై సందేహాలు ముసురుకుంటున్నాయి. యూజీసీ-నెట్ 2026 పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా పరిగణించి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే లీక్ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి.

ఇటీవల జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణపై వివాదాలు చెలరేగిన నేపథ్యంలో, యూజీసీ-నెట్ పరీక్ష కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరీక్షల భద్రత, పారదర్శకత, నిర్వహణ ప్రమాణాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల నుంచి కూడా స్పందనలు వచ్చాయి. పరీక్షా వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని అధికారులు కోరుతున్నారు. అటు దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. లీక్ ఆరోపణల్లో నిజం ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయినా విమర్శల జడివాన మాత్రం ఆగడం లేదు.









