సోఫాలాంటి సీట్లు.. విమానం లాంటి జర్నీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450కిమీ.. 75000ల మంది సొంతమైన కారు
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా(JSW MG Motor India)కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీ (MG Windsor EV) అమ్మకాల్లో దుమ్ములేపుతోంది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ మోడల్ భారత మార్కెట్లోకి ప్రవేశించిన కేవలం రెండేళ్లే కాలంలోనే 75,000 యూనిట్ల విక్రయాల మైలు రాయిని దాటేసిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుతమైన అమ్మకాల వేగంతో విండ్సర్ ఈవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా టాప్ ప్లేసులో నిలిచింది. గత కొన్ని నెలలుగా ఎంజీ మోటార్స్ కంపెనీ నుంచి అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా కూడా ఇదే రికార్డు క్రియేట్ చేసింది.
ఈవీ అమ్మకాల్లో నంబర్ 1
ఈ ఏడాది మొదటి ఆరు నెలల సమయం కూడా విండ్సర్ ఈవీకి భారీ లాభాల పంట పండించింది. జనవరి నుంచి జూన్ 2026 మధ్య కాలంలోనే కంపెనీ ఏకంగా 19,000 కంటే ఎక్కువ విండ్సర్ కార్లను విక్రయించింది. ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కారణంగానే భారతదేశపు ఈవీ సేల్స్ చార్ట్లో ఈ కారు మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. మార్కెట్లో విండ్సర్ ఈవీతో పాటు కంపెనీకి చెందిన కామెట్ (Comet), జెడ్ఎస్ ఈవీ (ZS EV) మోడళ్లకు కూడా కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. ఈ మూడు కార్ల అద్భుతమైన విక్రయాల వల్లే ఎంజీ మోటార్స్ ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది.

తక్కువ ధరలో లగ్జరీ కారు ఫీలింగ్ ఇస్తున్న మోడల్
ఎంజీ విండ్సర్ ఈవీ ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం వెనుక కంపెనీ అనుసరించిన ABC వ్యూహమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారును ఎంజీ సంస్థ ఎంతో తెలివిగా డిజైన్ చేసింది. ‘A’ అంటే ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ధర, ‘B’ అంటే ప్రీమియం సెగ్మెంట్ కారు ఎక్స్ టీరియర్ లుక్, ‘C’ అంటే పెద్ద లగ్జరీ కార్లలాంటి విశాలమైన లోపల కేబిన్ స్పేస్.
ఈ మూడు ఫార్ములాల కలయికతో ఈ కారు రూపుదిద్దుకుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు, విశాలమైన స్పేస్ కోరుకునే భారతీయ కుటుంబాలకు ఈ కారు పర్ఫెక్ట్ ఛాయిస్గా మారింది. ఈ క్రేజ్ ఇలాగే కొనసాగించేందుకు కారులో ఉపయోగించే విడిభాగాల స్థానిక తయారీని ఏకంగా 70 శాతానికి పెంచాలని ఎంజీ మోటార్స్ ప్లాన్ చేస్తోంది.

సరికొత్త BaaS స్కీమ్తో కస్టమర్లకు భారీ ఊరట
ఈ కారు ధర, విక్రయించే విధానం కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. విండ్సర్ ఈవీని కంపెనీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే సరికొత్త స్కీమ్ కింద విక్రయిస్తోంది.. దీని ప్రకారం కారు ప్రారంభ ధర కేవలం రూ.9.99 లక్షలుగా ఉంటుంది. అయితే, కారులోని బ్యాటరీని కస్టమర్ రెంట్ ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి కిలోమీటరు ప్రయాణానికి రూ.3.9 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాలి. ఈ పద్దతి వల్ల కారు కొనేటప్పుడు కస్టమర్ పై ఒకే సారి పెద్ద మొత్తంలో భారం పడదు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల జర్నీ
ఈ ఎలక్ట్రిక్ కారు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రెండు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తోంది. మొదటిది 38 kWh బ్యాటరీ ప్యాక్, ఇది సింగిల్ ఛార్జ్పై 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.. ఇక రెండవది దీని టాప్ ప్రొ వేరియంట్లో లభించే 52.9 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారికి ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

కారులో ఇంటి సోఫాలాంటి సీట్లు
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కారు కేబిన్ లోపలికి అడుగుపెట్టగానే ఒక లగ్జరీ ఫ్లైట్ లేదా ఫైవ్ స్టార్ హోటల్ రూం లాంటి ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా ఏరో లాంజ్ సీట్లను ఇచ్చారు, వీటిని ప్రయాణికులు తమకు నచ్చినట్లు 135 డిగ్రీల వరకు వెనక్కి వాలుచుకోవచ్చు.
అంటే కారు ప్రయాణంలోనే హాయిగా పడుకోవచ్చు. అలాగే కారు డ్యాష్బోర్డ్పై ఏకంగా 15.6 ఇంచుల భారీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అమర్చారు. కారులోని దాదాపు అన్ని ఫీచర్లు ఈ స్క్రీన్ ద్వారానే కంట్రోల్ అవుతాయి. ఫ్లాట్-ఫ్లోర్ కేబిన్, పెద్ద గ్లాస్ విండోస్, ప్రీమియం ఇంటీరియర్స్ ఈ కారును భారతదేశపు బెస్ట్ ఫ్యామిలీ ఈవీ కారులాగా మార్చేశాయి.







