- ముందస్తు అరెస్టుల పేరిట దౌర్జన్యం.. మేమేమైనా ఉగ్రవాదులమా?
- మహిళలు అడ్డుకున్నా వినని పోలీసులు..
- అధికార పార్టీ ఆగడలను అడ్డుకుంటాం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరులో మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టుల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రజాప్రతినిధులను టెర్రరిస్టుల వలే ట్రీట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం తాండూరులో నిర్వహించిన ‘రైతు వారోత్సవాలకు’ రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ క్రమంలో నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ జావీద్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జావీద్ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్తుండగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పోలీసులను అడ్డుకున్నారు. మహిళలు అడ్డుగా నిలుచున్నప్పటికీ, పోలీసులు వారిని పక్కకు తోసేస్తూ జావీద్ను బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.అరెస్టు అనంతరం జావీద్ ఓ ప్రకటన లో..మాట్లాడుతూ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లను ఉగ్రవాదుల తరహాలో ఈడ్చుకెళ్లడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనమన్నారు. అడ్డువచ్చిన మహిళలను కూడా చూడకుండా తోసేయడం ఎంతవరకు సమంజసం? పోలీసులు కేవలం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్నారు. ఇలాంటి దౌర్జన్యాలు ప్రజాస్వామ్యానికి విఘాతం. అని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రుల పర్యటన ఉన్న ప్రతిసారీ ప్రతిపక్ష నాయకులను వేధించడం సరికాదని, పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భయం గుపెట్లోన్నే ఉన్నారని, వారు చేస్తున్న అన్యాయాన్ని బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తారానే భయం తోనే ముందస్తు ఆరెస్ట్ లు చేయించారాని తెలిపారు. అధికార పార్టీ ఆగడాలను ఎండాకాట్టేంత వరకు బిఆర్ఎస్ పార్టీ నాయకుల పోరాటం ఆగదని వెల్లడించారు.




