గ్యాస్ డీలర్ల తీరుపై ఆగ్రహం..! 

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • వినియోగదారులను ఇబ్బంది పెడితే ఊరుకోం
  • హోమ్ డెలివరీ నిలిపివేతపై ఆగ్రహం
  •  ఆర్డిఓ కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో వంటగ్యాస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించారు. గ్యాస్ డీలర్లు అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారని మండిపడుతూ, గురువారం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలో గ్యాస్ డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. "సకాలంలో బుకింగ్ చేసుకున్నా డెలివరీ ఇవ్వడం లేదని,పైగా ఆటోల ద్వారా ఇంటికి పంపే విధానాన్ని స్వస్తి పలికి, వినియోగదారులే నేరుగా వచ్చి తీసుకెళ్లాలని ఇబ్బంది పెడుతున్నారన్నారు. మండుతున్న ఎండల్లో మహిళలు, వృద్ధులు సిలిండర్ల కోసం గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.నిజమైన వినియోగదారులకు గ్యాస్ అందడం లేదు కానీ, బ్లాక్ మార్కెట్లో మాత్రం సిలిండర్లు యథేచ్ఛగా అమ్ముడుపోతున్నాయని నాయకులు ఆరోపించారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.డీలర్ల అక్రమాలను అరికట్టి, తక్షణమే ఇంటింటికీ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరారు. లేనిపక్షంలో ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లు జావీద్, సురేష్, నాయకులు సంతోష్ గౌడ్, కరుణాకర్, యోగానంద్ రుద్రు పాటిల్ పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *