- అధికారుల కళ్లుగప్పి మళ్ళీ షెడ్ల నిర్మాణం
- కోట్లాది రూపాయల విలువైన 1600 గజాల స్థలం అన్యాక్రాంతం
- అధికారుల తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. పట్టణ నడిబొడ్డున, ప్రధాన రహదారి పక్కన ఉన్న మున్సిపల్ పార్కు స్థలాన్ని ఆక్రమణదారులు కబళిస్తున్నారు. అధికారుల సమక్షంలోనే కూల్చివేతలు జరిగినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా మళ్ళీ నిర్మాణాలు చేపట్టడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.పట్టణంలోని 7వ వార్డు పరిధిలో గల సర్వే నెంబర్ 51లో సుమారు 1600 గజాల మున్సిపల్ పార్కు స్థలం ఉంది. ఈ స్థలం గత కొంతకాలంగా వివాదంలో ఉండగా, న్యాయస్థానం సైతం ఇది మున్సిపాలిటీకి చెందిన స్థలమేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే, నాలుగు రోజుల క్రితం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు స్థలంలో వెలిసిన అక్రమ షెడ్డును కూల్చివేశారు.అధికారులు కూల్చివేత చేపట్టిన కొద్ది రోజులకే ఆక్రమణదారులు మళ్ళీ బరితెగించారు. సదరు స్థలం తమదేనంటూ పాత షెడ్డు స్థానంలో కొత్త నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారు. కేవలం సర్వే నెంబర్ 51 మాత్రమే కాకుండా, 130లో కూడా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.రోడ్డు పక్కన బతుకుదెరువు కోసం చిన్న చిన్న డబ్బాలు పెట్టుకున్న చిరు వ్యాపారస్థులను నిబంధనల పేరుతో తొలగించిన అధికారులు, కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కళ్లముందే కబ్జా అవుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం మరియు మున్సిపల్ యంత్రాంగం ఆక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.పట్టణ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని, అక్కడ రక్షణ గోడ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.




